నైపుణ్యంతో నారీ శక్తికి కొత్త బలం..!
40 రోజుల ఉచిత శిక్షణతో మహిళలకు స్వయం ఉపాధి బాట
జూట్ బ్యాగ్ తయారీ, మగ్గం శిక్షణకు రామాయంపేటలో శ్రీకారం
– మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు
రామాయంపేట, సెప్టెంబర్ 5: మహిళల చేతుల్లో నైపుణ్యం పెడితే కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని, మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రామాయంపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గజవాడ లావణ్య నాగరాజు అన్నారు.
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత జూట్ బ్యాగ్ తయారీ మరియు మగ్గం శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మహిళలకు అవగాహన కల్పిస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, 40 రోజుల పాటు నిర్వహించే ఉచిత శిక్షణను మహిళలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ కమిషనర్ ఏ. రవీందర్, మహిళా సాధికారి సహాయ అధికారి నాగమణి మాట్లాడుతూ, మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.
“నైపుణ్యం నేర్చుకున్న మహిళ స్వయం ఉపాధితో నిలదొక్కుకుంటుంది... ఒక మహిళ ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది... కుటుంబాలు ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుంది” అనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, కొక్కు ప్రవీణ్, పుట్టి సందీప్, జంగంపల్లి శంకర్ గౌడ్, దేవుని రంజిత్ కుమార్తో పాటు మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.
