శ్రీవిద్యా పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
కృష్ణుడు, గోపికల వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులు.. ఉట్టి కొట్టే కార్యక్రమంతో సందడి
పాపన్నపేట, సెప్టెంబర్ 4 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
పాపన్నపేట మండల కేంద్రంలోని శ్రీవిద్యా పాఠశాలలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో విద్యార్థులు పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ గుప్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టి కొట్టేందుకు చిన్నారులు పోటీపడుతూ సందడి చేశారు.
విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సంప్రదాయ కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రవీందర్ గుప్తా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను విద్యార్థులకు చిన్నతనం నుంచే పరిచయం చేయడంలో ఇటువంటి పండుగలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం ద్వారా ధర్మం, సమయస్ఫూర్తి, సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ విటలాక్షప్ప, సుమన్, నిఖిత, కృష్ణతో పాటు ఉపాధ్యాయులు జ్యోతి ప్రధాన్, విలాస్, ఆర్గిల్, వసుంధర, ఇందిరా, సుజాత, వనజ, గౌతమి, స్రవంతి, అశ్విని, నిర్మల, సునీత, ప్రియాంక, విజయ, దుర్గ, లావణ్య, షీలా, అనురాధ, పల్లవి తదితరులు పాల్గొన్నారు.
