కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ పదేళ్లు వెనక్కి
వెయ్యి రోజుల విధ్వంస పాలనపై ఇంటింటికీ ‘బాకీ కార్డు’
కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్
తూప్రాన్, సెప్టెంబర్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడిందని బీఆర్ఎస్ తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్ విమర్శించారు. శనివారం తూప్రాన్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రజలకు ‘బాకీ కార్డులు’ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జైపాల్ నాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాప్రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటో డ్రైవర్లు తదితర వర్గాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను పక్కనపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే ఇంటింటికీ ‘బాకీ కార్డులు’ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మరింత ఆదరణ లభిస్తుందని జైపాల్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్ష ప్రజల్లో ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్, కొత్త నర్సింలు, శ్రీకాంత్, నరేష్, హైమద్, శ్రీను, శేఖర్, లూకా తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ | తూప్రాన్

