దోమలపై దండయాత్ర.. అంటు వ్యాధుల నివారణే లక్ష్యం
రామాయంపేటలో ‘డ్రైడే–ఫ్రైడే’ కార్యక్రమం.. 9వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు
రామాయంపేట, సెప్టెంబర్ 4 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటు వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని రామాయంపేట మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణలో భాగంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శుక్రవారం ‘డ్రైడే–ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మున్సిపల్ కమిషనర్ ఏ. రవీందర్, వార్డు కౌన్సిలర్ దేవుని రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది కలిసి వార్డులో విస్తృతంగా పర్యటించారు. మురికి కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. దోమలు, క్రిమికీటకాలు వృద్ధి చెందకుండా పలు ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు దోమల నివారణపై అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, నీటి డబ్బాలు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించాలని తెలిపారు.
వారానికి ఒకరోజు ఇంటితో పాటు పరిసరాలను పూర్తిగా పరిశీలించి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని అధికారులు సూచించారు. దోమల ఉత్పత్తికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
“పరిశుభ్రమైన పరిసరాలు.. ఆరోగ్యకరమైన జీవనానికి పునాది” అని పేర్కొంటూ డ్రైడే కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ నాగలక్ష్మి, మున్సిపల్ జవాన్ ప్రవీణ్, కృష్ణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
