అప్రమత్తతతో తప్పిన భారీ అగ్ని ప్రమాదం..!
రామాయంపేటలో వెల్డింగ్ పనుల సమయంలో చెలరేగిన మంటలు
ఫైర్ ఎక్స్టింగ్విషర్తో సకాలంలో మంటలు అదుపు.. వ్యాపార సంస్థల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన అవసరం
రామాయంపేట, సెప్టెంబర్ 2 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
క్షణిక అప్రమత్తతతో రామాయంపేటలో పెను అగ్ని ప్రమాదం తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీనరసింహ ఇంజనీరింగ్ వర్క్షాప్ సమీపంలో బైక్ స్టాండ్కు వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
వెల్డింగ్ పనుల సమయంలో వెలువడిన నిప్పురవ్వలు సమీపంలోని వస్తువులకు తగలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది. సమీపంలోనే వాహనాలు, ఇతర షాపులు ఉండటంతో మంటలు మరింత విస్తరించి ఉంటే భారీగా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉండేది.
ఫైర్ ఎక్స్టింగ్విషర్తో మంటలకు చెక్
అయితే ఎదురుగా ఉన్న వాసు బైక్ మెకానిక్ షాప్ యజమాని పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన షాప్లో అందుబాటులో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ను తీసుకొచ్చి మంటలపై ప్రయోగించారు. దీంతో మంటలు క్రమంగా అదుపులోకి వచ్చాయి.
సకాలంలో ఫైర్ సేఫ్టీ పరికరాన్ని వినియోగించడంతో మంటలు పక్కనున్న షాపులు, వాహనాల వైపు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు. అప్రమత్తంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంపై స్థానికులు షాప్ యజమానిని అభినందించారు.
ప్రతి షాపులో ఫైర్ సేఫ్టీ తప్పనిసరి
ఈ ఘటన ప్రతి వ్యాపార సంస్థకు ఒక హెచ్చరికగా నిలుస్తోంది. ముఖ్యంగా వెల్డింగ్ వర్క్షాప్లు, మెకానిక్ షాపులు, గ్యారేజీలు, ఎలక్ట్రికల్ పనులు జరిగే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉన్నందున వ్యాపారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రతి షాప్లో తప్పనిసరిగా ఫైర్ ఎక్స్టింగ్విషర్ అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయంలో దాన్ని ఎలా ఉపయోగించాలో షాప్ యజమానులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ పరికరాలను కేవలం ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా అవి పనిచేసే స్థితిలో ఉన్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని చెబుతున్నారు.
ముందస్తు జాగ్రత్తే రక్షణ
అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని స్థానికులు పేర్కొన్నారు. షాపుల్లో విద్యుత్ వైర్లు, గ్యాస్ సిలిండర్లు, ఇంధనం, మండే వస్తువులు వంటి వాటిని సురక్షితంగా ఉంచాలని సూచించారు.
“ముందస్తు జాగ్రత్తే ప్రాణాలకు.. ఆస్తులకు రక్షణ” అనే విషయాన్ని ప్రతి వ్యాపారి గుర్తుంచుకోవాలని, అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని కోరుతున్నారు. રామాయంపేటలో జరిగిన ఈ ఘటన చిన్నపాటి అప్రమత్తతతోనే పెద్ద ప్రమాదాన్ని ఎలా నివారించవచ్చో మరోసారి చాటిచెప్పింది.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్
