ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు..!
మండల స్థాయిలో ప్రజా సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ
అధికారులు సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని ఎంపీడీవో కృష్ణమూర్తి సూచన
తూప్రాన్/మనోహరాబాద్, ఆగస్టు 31 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయని మనోహరాబాద్ ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ శాఖలకు చెందిన 16 మంది అధికారులు హాజరై ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం నాలుగు దరఖాస్తులు అందినట్లు ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు.
పాస్బుక్ సవరణకు దరఖాస్తు
వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన అశోక్గౌడ్ తన భూమికి సంబంధించిన సమస్యపై ఫిర్యాదు చేశారు. 166/ఈఈ సర్వే నంబర్లో రైల్వే లైన్ కోసం 1.75 గుంటల భూమికి బదులుగా 12.75 గుంటల భూమి డిడక్ట్ అయినట్లు తెలిపారు. రికార్డులను పరిశీలించి పాస్బుక్లో సవరణ చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు.
భూమి రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ ఫిర్యాదు
పోతారం గ్రామానికి చెందిన ఎం. సునిత తనకు తెలియకుండా 52/ఈ/1/2 సర్వే నంబర్లోని భూమిని విక్రయానికి పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. సంబంధిత భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు.
అనుమతులు లేకుండా నిర్మాణంపై ఫిర్యాదు
కోనాయపల్లి పీటీ శివారులోని 2-87/2 ఇంటి నంబర్ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినట్లు బక్క సురేష్ ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ నుంచి కానీ, హెచ్ఎండీఏ నుంచి కానీ అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేపట్టి సుమారు తొమ్మిది సంవత్సరాలు అవుతోందని, ఇప్పటివరకు ఎలాంటి పన్నులు కూడా చెల్లించడం లేదని ఆయన తన దరఖాస్తులో పేర్కొన్నారు. దీనిపై అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇందిరమ్మ ఇంటి బేస్మెంట్ బిల్లు కోసం దరఖాస్తు
రామాయపల్లి గ్రామానికి చెందిన కలాలి రజని తనకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన బేస్మెంట్ బిల్లు ఇప్పటివరకు అందలేదని ఫిర్యాదు చేశారు. బిల్లు మంజూరు చేసి ఇంటి నిర్మాణాన్ని కొనసాగించేందుకు సహకరించాలని ఆమె కోరారు.
ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని ఎంపీడీవో కృష్ణమూర్తి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
– తెలుగు ట్రెండ్స్ న్యూస్
