గ్రామసభల్లో సమస్యల పరిష్కారానికి అధికారుల హామీ..!
కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహణ
భూ సమస్యలు, ఓటరు జాబితాలు, గ్రామపంచాయతీ సమస్యలపై ప్రజల నుంచి వివరాలు సేకరణ
కొల్చారం, సెప్టెంబర్ 3 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు కొల్చారం మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామసభలను గ్రామ ప్రజల మధ్య నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు గ్రామసభలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి, కొంగోడు, నాయిని జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, కొల్చారం మండల తహసీల్దార్ శ్రీనివాస్చారి అధ్యక్షతన ఆయా గ్రామాల్లో గ్రామ ప్రజలతో సమావేశమై స్థానిక సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న అధికారులు
ఈ సందర్భంగా ఆర్డీవో రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఏవైనా భూ సమస్యలు, గ్రామపంచాయతీకి సంబంధించిన సమస్యలు, ఓటరు జాబితాలో పేర్లకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే గ్రామసభల ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా అధికారులకు తెలియజేస్తే వాటిని పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, గ్రామస్థాయిలో అమలు చేస్తున్న పథకాలు, ఓటరు జాబితా తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలపై కూడా అధికారులు చర్చించారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులు సూచించారు.
ఊర చెరువు కబ్జాపై ఫిర్యాదు
నాయిని జలాల్పూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఊర చెరువుకు సంబంధించిన సమస్యను గ్రామ ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చెరువు భూమిని కబ్జా చేసి వరి నాట్లు వేస్తున్నారని గ్రామస్తులు ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్చారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలను గ్రామసభలో నేరుగా అధికారులకు వివరించడంతో వాటిపై అధికారులు స్పందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రామసభలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపే వేదికగా ఉపయోగపడాలని అధికారులు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, ఆర్ఐ సుమలత, జీపీఓ పద్మ, పంచాయతీ కార్యదర్శి మౌనిక, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ నవనీత, సర్పంచ్ దేవ్సింగ్, ఉపసర్పంచ్ వెంకట నర్సింలు, నాయకులు రాయన్న, ఏగొండ మల్లేశం, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

