🚧 6వ వార్డులో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం..!
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నిధుల సహకారంతో నిర్మాణ పనులు ప్రారంభం
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: కాంగ్రెస్ నాయకులు
మెదక్, సెప్టెంబర్ 3 (తెలుగు ట్రెండ్స్ న్యూస్):
మెదక్ పట్టణంలోని 6వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు నిధుల సహకారంతో చేపట్టిన ఈ పనులను మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతిరాజు, 6వ వార్డు కౌన్సిలర్ హరిత ఆధ్వర్యంలో ప్రారంభించారు.
వార్డులో రోడ్డు సౌకర్యం మెరుగుపడటంతో స్థానిక ప్రజలకు రాకపోకల విషయంలో ఇబ్బందులు తగ్గనున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు బురదమయంగా మారకుండా సీసీ రోడ్డు నిర్మాణం ఉపయోగపడుతుందని స్థానికులు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత వార్డు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 6వ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.
స్థానిక ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. వార్డు అభివృద్ధిలో ప్రజల సహకారం కూడా కీలకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాగి అశోక్, గంగాధర్, సంగ శ్రీకాంత్, సుభాష్ చంద్రబోస్, ముజమ్మిల్, ఉదయ్(నాని )తదితరులతో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
